కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ అపాయింట్ మెంట్ ను కోరగా అందుకు ఆమె నిరాకరించిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆమె అన్నారు.
గత నాలుగు నెలలుగా ఇదే విధానాన్ని రాజ్ భవన్ అవలంబిస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాజ్ భవన్ వ్యవహరిస్తుందని తెలిపారు. రాజ్ భవన్ తలుపులు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు.ఎవరికైనా ఏ సమస్యలైనా ఉంటే మెయిల్ చేయాలని చెప్పారు. కరోనా రికవరీ రేటులో తెలంగాణ ముందు స్థానంలో ఉందని తమిళిసై చెప్పారు. మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబునిచ్చారు.