టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతన మార్కెట్ యార్డ్ కార్యవర్గం ఈ రోజు ప్రమాణస్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి కొడాలి నాని, పేర్ని నానిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చడం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.
పేదల కోసం తాము ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే విపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు తన మనుషులను పెట్టుకుని జగన్ చేస్తున్న మంచి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుటిల యత్నాలను వైసీపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.