ముంబయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యూఎస్ ఇండియా యూనివర్శిటీ ర్యాంకింగ్స్లో వరుసగా రెండోసారి ప్రథమస్థానంలో నిలిచింది. తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటి ఢిల్లీ నిలిచాయి. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన విశ్వవిద్యాలయాల క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ జాబితాలో ఈ మూడు భారత విశ్వవిద్యాలయాలకు టాప్ 200లో స్థానం దక్కడం విశేషం.
గత కొన్నేళ్లుగా ఈ మూడు సంస్థలు వరుసగా జాతీయస్థాయిలో కూడా అత్యుత్తమ ర్యాంకుల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. భారత ర్యాంకింగ్లో టాప్ 10 ఇన్స్టిట్యూట్ల్లో చోటు దక్కించుకున్న ఇతర ఐఐటిల్లో మద్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ, గౌహతి ఉన్నాయి. మరో రెండు కేంద్ర సంస్థలు ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం వరుసగా 7,8స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలైన జెఎన్యు, జాదవ్పూర్ యూనివర్శిటీల కంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోల్కతా యూనివర్శిటీ 11వస్థానంలో నిలిచింది.