లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయ డంఖా మోగించేందుకు సిద్దమవుతుంది. లోక్ సభ స్థానాలకు సంబందించిన అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఇంకా ఎలాంటి హడావిడి మొదలు పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పోటీచేసేందుకు సిద్దమవుతుంది. లోక్ సభ నియోజకవర్గాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమిటీలను ప్రకటించడం తో బరిలోకి దిగడం ఖాయం గా కనిపిస్తుంది. మూడు లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లతో పాటు కమిటీలను కూడా ప్రకటించారు.
సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖమ్మం లోక్ సభ స్థానాలకు గురువారం కమిటీలను ప్రకటించిన జనసేన అధినేత..త్వరలోనే మరిన్ని లోక్ సభ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెదక్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ లోక్ సభ నియోజకవర్గాలకు కూడా ఇదే తరహాలో కమిటీలను ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తరహాలోనే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ వామపక్షాలతోనే పవన్ ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది.