దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి మంత్రి గడ్కరీ చేస్తున్న కృషి అద్భుతమంటూ యూపీయే ఛైర్పర్సన్ సోనియాగాంధీ కితాబునిచ్చారు.లోక్సభలో గురువారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పనితీరును మెచ్చుకున్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలుపుతూ బల్లలపై చేతులతో చరిచారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ తన మంత్రిత్వశాఖకు సంబంధించిన రెండు ప్రశ్నలకు సమాధానమిస్తూ దేశంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరు ఎంపీలు తన శాఖ ద్వారా జరిగిన పనులపై ప్రశంసిస్తున్నారన్నారు.
గడ్కరీ సమాధానాలివ్వడం పూర్తిచేసిన వెంటనే అధికార భాజపా సభ్యులంతా బల్లలు చరిచారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆ పార్టీ ఎంపీ గణేశ్సింగ్ నిల్చొని గడ్కరీ కృషికి గాను సభ ఆయనను అభినందించాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ను కోరారు. గడ్కరీ చెప్పిందంతా సావధానంగా ఆలకించిన సోనియాగాంధీ అప్పుడప్పుడూ ఆయన చెప్పిన అంశాలకు సమాధానంగా తల ఊపుతూ కనిపించారు. గణేశ్సింగ్ ప్రతిపాదన నేపథ్యంలో ఆమె చిరునవ్వుతో బల్లపై కొట్టడం ప్రారంభించారు.