కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం నిర్మల్ రానున్నారు. వెయ్యిమంది అమరవీరులకు ఆయన నివాళులర్పించిన అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి దారిలో గల క్రషర్ మైదానంలో తెలంగాణ విమోచన సభలో పాల్గొంటారు. పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిర్మల్ సభ కోసం బండి సంజయ్ తమ పాదయాత్రకు ఒకరోజు విరామం ఇవ్వనున్నారు. పాదయాత్రలో తనతో వెంట నడుస్తున్న 300 మంది కార్యకర్తలు, ఇతర నాయకులతో కలిసి నేరుగా నిర్మల్ బహిరంగసభ వేదికకు చేరుకుంటారు.
తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న బీజేపీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నిర్మల్లో భారీ సభకు ఏర్పాట్లు చేసింది. రాంజీగోండు సహా వెయ్యిమంది వీరుల ప్రాణత్యాగాల చరిత్రను దేశానికి తెలిసేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ చెబుతోంది. ఈ కార్యక్రమానికి అమిత్షా ముఖ్యఅతిథిగా రానుండడంతో జాతీయస్థాయిలో నిర్మల్ పేరు చర్చకు వస్తోంది.