తన సోదరుడు రాహుల్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజలకోసం నిలబడ్డారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కేరళలోని వాయనాడ్ లో రాహుల్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ రాహుల్ గురించి చెబుతూ, “నేను ఒక చెల్లెలుగా మీ ముందుకు వచ్చాను, ” అంటూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
అమరుడైన తండ్రిని ఓ దొంగ అని నిందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దకాలంగా ఆయనపై దాడులు చేసినప్పటికీ అన్నింటిని తట్టుకుని ఎదిరించి నిలిచారని కొనియాడారు. బీజేపీ ఈ ఐదేళ్లలో చేసింది ఏమిటంటే దేశాన్ని ముక్కలు చేయడం, ప్రజలను విభజించడమేనంటూ ధ్వజమెత్తారు. కేరళ, తమిళనాడు, యూపీ, గుజరాత్ అన్నీ దేశంలో భాగమేనని, కానీ బీజేపీ తన పాలనలో ప్రజల మధ్యన చీలిక తెచ్చిందని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ నేతలు నెరవేర్చలేదని ఆరోపించారు.