లక్ష రూపాయల రుణమాఫీ హామీపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దీనిపై కేసీఆర్ రైతులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాత్ల్దుటూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ.. పలు హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.
కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలావరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామన్న మాటనే మర్చారని మండిపడ్డారు.రాష్ట్రంలో పన్నెండువేల పాఠశాలలను ఎందుకు మూసివేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యం, గుడ్లు అందడంలేదన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలు వైద్యంకోసం అగచాట్లు పడుతున్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ అమలు అటకెక్కిందని విమర్శించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఎందుకు దివాలా తీసిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.