ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో అంతర్జాతీయ సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. టీడీపీ పోరాటం వల్లే ఈవీఎంలకు వీవీ ప్యాట్ రశీదులు వచ్చాయన్నారు. కానీ రశీదుపై ముద్ర రంగు తక్కువగా ఉంటోందని..వెంటనే కరిగిపోతోందన్నారు. వీవీ ప్యాట్ కూడా 100% నియోజకవర్గాల్లో అమలు లేదని చెప్పారు.
ఈవీఎంలపై జాతీయస్థాయిలో చర్చిస్తున్నామని, 22పార్టీల ప్రతినిధులతో త్వరలోనే ఈసీని కలుస్తామని వెల్లడించారు. 20 దేశాల్లో అసలు ఈవీఎంలను వినియోగించడం లేదని, 20 దేశాల్లోనే వినియోగం ఉందన్నారు. అలాగే కేబినెట్ భేటీలో తీసుకున్న చారిత్రక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి శ్రేణులకు సూచించారు. ఈవీఎంలపై అందరూ అవగాహన పెంచుకోవాలని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు సూచించారు.