ఏపీలో రేపు మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడ అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు తెరమీదకు వచ్చిన సమయం నుండి అక్కడ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చాలా కీలకంగా మారారు. అయితే ఆయనకు తాజాగా స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. ఆయన కంటికి ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు తెలుస్తోంది.దీంతో ఈ రోజు కడప జిల్లా పర్యటనకు వెళ్లాల్సిన ఆయన దానిని వాయిదా వేసుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి కంటి పరీక్షల నిమిత్తం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష యుద్ధం నడుస్తోంది. ముందుగా నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా ఎలా అయినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ఉండడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల నిర్వహించాల్సిందేనని తీర్పు వెలువరించడంతో ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు మొదటి దశ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ కంటికి ఇన్ఫెక్షన్ రావడం చర్చనీయాంశంగా మారింది.
previous post
జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్రెడ్డి