వినాయకచవితి వేడుకలపై పండితులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయకచవితిపై విపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకునే తాము వినాయకచవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ప్రజలకు సూచించామని, ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.ఈ అంశంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కూర్చుని వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణరాజుకు అంత ప్రేమే ఉంటే సొంత నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి వేడుకల్లో పాల్గొనాలని అన్నారు.