ఓవైపు రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో చల్లని బీరు సేవించి కాస్త ఉపశమనం పొందాలనుకున్న సమయంలో బీర్ల సరఫరా నిలిపివేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. బీరు తాగకండి.. కావాలంటే లిక్కర్ తాగండి అంటూ హుకుం జారీ చేసినట్టు సమాచారం. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బీరు విక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడ చాలామంది మద్యం ప్రియులు బీరే ఎక్కువగా ఇష్టపడతారు. ఎండాకాలంలో బీరు విక్రయాలు జోరుగా ఉంటాయి. కానీ ఎక్సైజ్ శాఖ ఈ బీరు విక్రయాలకు అడ్డుకట్ట వేస్తూ మద్యం అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది.బీరుపై ఎక్సైజ్ డ్యూటీ తక్కువగా ఉండగా, మద్యంపై ఎక్కువగా ఉంది. అందుకే మద్యాన్ని విక్రయిస్తే ఖజానాకు ఎక్కువ రాబడి వస్తుందన్నది ఎక్సైజ్ శాఖ ఉద్దేశం.
ఎక్సైజ్ శాఖ తీసుకొనున్న ఈ నిబంధనలతో వైన్ షాపులు, బార్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. లైసెన్సు ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తుంటే తమపై లేనీ పోనీ నిబంధనలు పెడుతూ నష్టాలకు కారణమవుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బుధవారం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి అన్ని మద్యం డిపోలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. వైన్ షాపులు, బార్లు, క్లబ్బులవారికి బీరు విక్రయించరాదని, కేవలం మద్యం మాత్రమే సరఫరా చేయాలన్నది ఆ ఆదేశాల సారాంశం. దీంతో రాష్ట్రంలోని 19 డిపోల మేనేజర్లు బుధవారం ఎవరికీ బీరును సరఫరా చేయలేదు. కేవలం మద్యంను లిఫ్ట్ చేయాలనుకున్న వారికి మాత్రమే సరఫరా చేశారు. ఒక్క బీరు సీసా కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. అదేమని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాలంటూ డిపో మేనేజర్లు సమాధానమిచ్చారని వైన్ షాపుల యజమానులు వెల్లడించారు.
కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీడీఓ సస్పెన్షన్!