వరలక్ష్మీ వ్రతానికి తెలుగురాష్టాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అధికంగా పండగను వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే భక్తులు కోరుకున్న కోరికలను నెరవేరస్తుందని విశ్వాసం. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
ఈ రోజు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారు. ఈ రోజు ప్రతి ఇళ్లు ఓ ఆలయాన్ని తలపిస్తోంది. పసుపు, కుంకుమాలు, పచ్చని తోరణాలతో ప్రతి ఇంటా లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. ఇక మహిళలు అయితే పూజలు, నోములు, ఉపవాసాలు అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు.శ్రావణమాసంలో పౌర్ణమి కి ముందుగా వచ్చే శుక్రవారంరోజున అమ్మవారిని వరలక్ష్మిదేవీ రూపంలో పూజిస్తారు.
ఈ వ్రతం చేయటం వల్ల అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని భక్తుల విశ్వాసం. శ్రావణ వరలక్ష్మీ వ్రతం శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. అప్పుడు కుదరని వారు తర్వాత వచ్చే వారాల్లోనూ చేసుకోవచ్చు. ఇది మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. అందుకే ఈ రోజు ఏ ఇంట చూసినా… ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తుంది. సకల సంపదలకూ ప్రతీక లక్ష్మీదేవి ఆవిడ ఏ మంచిని కోరినా అనుగ్రహించే తల్లి. అందుకే అందరితోనూ వరలక్ష్మిగా పిలిపించుకుంటోంది. ముఖ్యంగా కొత్త కోడళ్లతో ఈ వ్రతం చేయించడం అత్తింటా అనవాయితీ.
ఈ పూజ కొత్త నగతో చేయాలనేది నియమం. అందుకే నవ వధువులకు అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తయిదువులు లక్ష్మీరూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. సౌభాగ్యం, సిరిసంపదలు ఇవ్వమని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మీదేవి కి ప్రత్యేకత ఉంది.
శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రత కథ
స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.