లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో గత నెల 22 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లన్నీ నిలిచిపోయాయి. ఈ లాక్ డౌన్ 14వ తేదీతో ముగియనుంది. లాక్ డౌన్ తొలగిస్తారని వార్తలు వస్తున్నా, కేంద్రం నుంచి ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక రైళ్లు తిరుగుతాయా? తిరగవా? అన్న విషయాన్ని 10వ తేదీ తరువాత కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, దేశంలో కరోనా వ్యాప్తి తదితరాలను సమీక్షించిన తరువాతే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో మోదీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ లాక్ డౌన్ ను తొలగించి, రైళ్లును పట్టలేక్కిస్తే మాత్రం ప్రయాణీకులతో అన్నీ రైళ్లు కిటకిటలాడిపోతాయనడంలో సందేహం లేదు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా నాలుగు రోజుల క్రితమే రైల్ రిజర్వేషన్ ప్రారంభం కాగా, 15, 16 తేదీలకు దాదాపు అన్ని రైళ్లకూ బుకింగ్స్ పూర్తికాగా, కొన్ని రైళ్లలో 100 వరకూ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చి, తిరిగి వెనక్కు వెళ్లలేకపోయిన వారు ఈ టికెట్లను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.