కృష్ణా నదిలోకి గోదావరి నీటి తరలింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతస్థాయి ఇంజినీర్లు హైదరాబాద్ లో మంగళవారం భేటీ అయ్యారు. స్థానిక జలసౌధలో నీటి తరలింపుపై చర్చించారు. కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులకు 1300 టీఎంసీల నీరు అవసరం అని, తెలంగాణకు ప్రతిసారి కృష్ణా నుంచి 500 టీఎంసీల నీరు వస్తోందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు తెలిపారు. సాగర్, శ్రీశైలంకు నీటి తరలింపుపై మరో సమావేశంలో చర్చిస్తామన్నారు.
సీఎంల భేటీకి ముందు మరోసారి అధికారుల సమావేశం ఉంటుందన్నారు. ఆ సమావేశం తర్వాత సీఎంలకు నివేదిక అందజేస్తామన్నారు. కాగా, ఈ సమావేశంలో గోదావరి నుంచి కృష్ణాకు నీటి తరలింపుపై ప్రాథమికంగా చర్చించామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం, దుమ్ముగూడెం, ఇంద్రావతి కలిసిన తర్వాత మరోపాయింట్ ఉండేలా అంచనాలు రూపొందిస్తామని చెప్పారు.