కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 31న ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని 7 లోక్కల్యాణ్ మార్గ్లో సమావేశమయ్యారు. కరోనా వైరస్ తీవ్రత, లాక్డౌన్ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. హోమంత్రి అమిత్షా గురువారం రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ లాక్డౌన్పై అభిప్రాయాలు కోరారు. ఈ క్రమంలో అమిత్ షా ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలావుంటే, దేశంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో 7467 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కాలుమోపిన తర్వాత ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి కట్టడికి ఇంకా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే అంశంపై వారి భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా కొన్ని రోజులుగా పాల్పడుతున్న దుందుడుకు చర్యలపై కూడా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో వారు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.