గుంటూర్ జిల్లా మాచర్లలో ఈరోజు తాము ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడి ఘటన గురించి టీడీపీ నేత బోండా ఉమ వివరించారు. మంగళగరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటన రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వాదులను కలవరపరిచిందని అన్నారు. ఈ సంఘటనకు కారణం ఏంటో, తాము ఎందుకు వెళ్లామో, అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందన్న వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు మాచర్లకు వెళతామన్న విషయం తమకు తెలియదని అన్నారు. మాచర్లలో నిన్న సాయంత్రం జరిగిన పరిణామాల విషయమై మాట్లాడేందుకు తమ అడ్వకేట్లను తీసుకుని వెళ్లామని చెప్పారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. భద్రత కల్పించాలని చెప్పేందుకు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకే తాము వెళ్లామని చెప్పారు. ఈ క్రమంలో పక్కాగా స్కెచ్ గీసి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను, తనను నడిరోడ్డుపై హత్య చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు.