తాను కరోనాకు టీకాను తయారు చేశానంటూ ఏడో తరగతి చదివిన ఓ యువకుడు అధికారులకు లేఖ రాశాడు. దాన్ని మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని లేఖలో కోరాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ సమీపంలో జరిగింది. ఒడిశాలోని బార్ఘర్ జిల్లాకు చెందిన బీసీ ప్రహ్లాద్ లేఖ రాసినట్టు గుర్తించారు. ఈ లేఖను అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
హుటాహుటిన అతని ఇంటికి చేరుకుని, సోదాలు చేయగా, కరోనా వ్యాక్సిన్ అని రాసున్న వయల్స్ తో పాటు పలు రకాల కెమికల్స్ లభించాయి. ఈ టీకాను ఎలా చేశావని ప్రశ్నిస్తే, సమాధానం ఇవ్వలేదు. మొత్తం తన ప్రయోగం అత్యంత రహస్యమని చెప్పాడు. అతన్ని పలు మార్లు విచారించినా ఇదే సమాధానం రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు పెట్టామని పోలీసులు తెలిపారు. అతను గతంలో ఏవైనా మందులు తయారు చేసి విక్రయించాడా అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.