దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జైలులో శిక్ష అనుభవిస్తున్న జయలలిత స్నేహితురాలు శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్న విషయం వెలుగుచూసింది. సామాజికవేత్త ఎన్.మూర్తి సమాచార హక్కు చట్టం కింద వేసిన దరఖాస్తు ద్వారా జైలులో శశికళ అనుభవిస్తున్న వసతుల వివరాలు బయటపడ్డాయి. ఆమెకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని, జైలు అధికారులు శశికళ విషయంలో తప్పుడు ప్రచారం చేశారని మూర్తి ఆరోపించారు.
మొదట్లో ఆమెకు ఒక గది మాత్రమే కేటాయించారని.. ఆమె పక్కనున్న నాలుగు గదుల్లో 2017 ఫిబ్రవరి 14 వరకు మహిళా ఖైదీలు ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత వారందరినీ వేరే గదులకు తరలించి, ఐదు గదులను శశికళకే కేటాయించారని చెప్పారు. ఆమెకు వంట చేయడానికి ప్రత్యేకంగా ఒక ఖైదీని అధికారులు కేటాయించారని తెలిపారు. ఆమెను చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలను అనుమతిస్తున్నారని… వారంతా నేరుగా ఆమె గదికే వెళ్లి, 3 నుంచి 4 గంటల సేపు గడుపుతున్నారని అని మూర్తి చెప్పారు.