బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్కు ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స కొనసాగుతోంది.
అయితే, ఆయన పరిస్థితి మెరుగుపడలేదని తెలుస్తోంది. లాలూ శరీరంలో కదలికలు లేవని ఆయన తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెప్పారు.
వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై తేజస్వీ యాదవ్ నిర్ణయం తీసుకుంటామన్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని ఇది వరకే తేజస్వి యాదవ్ వెల్లడించారు.
ఇంట్లో మెట్లపై నుంచి కిందపడిన సమయంలో లాలూకు మూడు చోట్ల గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్లో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు.
లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్కు చేరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.