రాజ్యసభ సభ్యుడిగా విజయేంద్ర ప్రసాద్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు
రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయేంద్రప్రసాద్, విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, హర్భజన్ సింగ్ ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా సభలో ఉన్న ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ను ఆహ్వానించారు. సభ్యుల మధ్య నుంచి అభివాదం చేస్తూ ఛైర్మన్ పోడియం ముందుకు వచ్చిన విజయేంద్రప్రసాద్ ఆంగ్లంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా కోవ్వూరులో విజయేంద్ర ప్రసాద్ జన్మించారు. ఆయన తండ్రి ఓ కాంట్రాక్టర్. విజయేంద్ర ప్రసాద్కు ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఇందులో అందరికంటే విజయేంద్ర ప్రసాద్ చిన్నవాడు. ఆయన అన్న శివదత్తాకు కళలు, కవిత్వంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈక్రమంలో దర్శకుడిగా మారేందుకు మద్రాసు వెళ్లారు. ఆయన చాలా సినిమాలకు రచయితగా పనిచేసినా సక్సెస్ కాలేకపోయారు.
ఆ సమయంలో తన అన్న శివ దత్తాతో కలిసి విజయేంద్ర ప్రసాద్ రచనలు రాసేవారు. ఈక్రమంలో బంగారు కుటుంబం సినిమాకు తొలి స్టోరీని రాశారు. ఆ తర్వాత బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, జానకి రాముడు, సమరసింహారెడ్డి, సై, నా అల్లుడు, ఛత్రపతి, మగధీర వంటి సినిమాలకు కథలను సమర్పించారు. ప్రపంచ దృష్టికి ఆకర్షించిన బాహుబలి సినిమాకు సైతం విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు.
అనంతరం ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం పనిచేస్తానని తెలిపారు. రాజ్యసభలో ప్రజా సమస్యలను లేవనెత్తుతానని, ప్రజా సమస్యలపై జరిగే చర్చల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటానని తెలిపారు. తన కథలే తనను ఇంత దూరం ప్రయాణించేలా చేశాయని ఆయన తెలిపారు.