కువైట్లో ముగ్గురిని హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లా వాసి వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు.
మంచానికి ఉన్న వస్త్రంతో ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని కడపలోని కుటుంబ సభ్యులకు అక్కడి అధికారుల ద్వారా సమాచారం అందింది. వెంకటేష్ మరణ వార్త విని .. కడపలో ఉంటున్న అతడి ఫ్యామిలీ షాక్కు గురయింది. జైలు నుంచి నిర్దోషిగా బయటకు వస్తాడని అనుకున్నామని.. కానీ అంతలోనే ఘోరం జరిగిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లిన కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన వెంకటేష్.. అక్కడ ఓ ఇంట్లో డ్రైవర్గా పనిలో చేరాడు. రెండేళ్ల తర్వాత వెంకటేష్ తన భార్య స్వాతిని కూడా అక్కడికి తీసుకెళ్లారు.. దంపతులు ఇద్దరూ అక్కడే ఉంటుండగా, వారి ఇద్దరు పిల్లలు మాత్రం.. తాత దగ్గరే ఉంటున్నారు.
అయితే, వెంకటేష్ పనిచేస్తున్న ఇంట్లో ఈ నెల 6వ తేదీన దొంగలు పడ్డారు.. ఇంటి యజమానితో పాటు అతడి భార్య, కూతురిని హత్య చేసి.. దొరికినంతా దోచుకున్నారు.. కానీ, ఈ కేసులో వెంకటేష్పై కువైట్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ అరెస్ట్ చేశారు.
అయితే తప్పుడు కేసు పెట్టి తన భర్తను జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటోంది. వెంకటేష్ని అరెస్ట్ చేసి.. తనను బలవంతంగా ఇండియా పంపించారని ఆరోపించింది. పని నిమిత్తమే ఆ యజమానులు తమకు ఫోన్ కాల్స్ చేసే వారని.. అంతకు మించి తమకు ఏమీ తెలియదని తెలిపింది స్వాతి. నిజంగా వెంకటేష్ హత్య చేసి ఉంటే.. సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నిస్తోంది స్వాతి.
మృతులకు వారి బంధువులతో గొడవలు ఉన్నాయని.. వారే ఈ హత్యలు చేసి.. వెంకటేష్ను ఇరికించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తోంది. పొట్టకూటి కోసం చిన్నాచితక పనులు చేసే తాము.. అంత పెద్ద వారిని ఎందుకు హత్య చేస్తామని కన్నీళ్లు పెట్టుకుంటోంది.
వెంకటేష్ ఆత్మహత్య చేసుకొని ఉండడని.. జైలు అధికారులే చంపేసి ఉంటారని అతడి భార్య ఆరోపిస్తోంది. వెంకటేష్ఆత్మహత్య వార్తతో లక్కిరెడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడు: దేవినేని ఉమ