*విశాఖలో అదృశ్యమైన చిన్నారి సురక్షితం…
*పోలీసుల అదుపులో ఇద్దరు మహిళా కిడ్నాపర్లు..
*శ్రీకాకుళంలో ఆచూకి లభ్యం..
*చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణంలోని కేజీహెచ్ లో అదృశ్యమైన చిన్నారి కథ సుఖాంతమైంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సమీపంలో నిందితులను గుర్తించిన పోలీసులు చిన్నారితో పాటు వారినీ అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ కేజీహెచ్ నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు కేజీహెచ్ నుంచి గురుద్వారాకు ఆటోలో, అక్కడి నుంచి కారులో శ్రీకాకుళం వైపు బయలుదేరినట్లు పోలీసులు వెల్లడించారు.
వివర్లాలోకి వెళితే..
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలోని రేవిడి రౌతులపాలెం గ్రామానికి చెందిన మజ్జి అప్పయ్యమ్మ కేజీహెచ్ లోని గైనిక్ వార్డులో ఈనెల 11న చేరింది. ఈనెల 13న పాపకు జన్మనిచ్చింది. సిజేరియన్ కావడంతో తల్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఈ క్రమంలో గత మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో గుర్తు తెలియని ఇద్దరు మహిళలు ఒకరు నర్సుగా, ఇంకొకరు ఆయాగా నటించి ఆ వార్డులోకి వెళ్లి పసికందును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. కిడ్నాప్నకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఎట్టకేలకు కిడ్నాప్ర్లను పట్టుకున్నారు.