ఏదైనా శృతిమించితే విషమవుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు, అయితే నేటి సమాజంలో ఏది అతి, ఏది సరైనదో తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో మనసును విచ్చలవిడిగా తెలియకుండానే వదిలేస్తూ, అనేక వ్యసనాలకు తావిస్తున్నారు. దానివలన అనేక నేరాలు జరుగుతున్నాయి. దీనితో క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది, దీనికి వయోభేదం లేకపోవడం విశేషం. తాజాగా జరిగిన సంఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్న యువకుడికి పోలీస్ స్టేషన్ ముందే ఓ గృహిణి బడితపూజ చేసింది. పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోని అతడికి చెప్పుతో సత్కారం చేసింది.
హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని వినాయక్నగర్కు చెందిన గృహిణి (28) టైలర్. అదే ప్రాంతంలో నివసించే రాజు అలియాస్ కుమ్మరి రాజు గత కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్ నంబరు సంపాదించి రోజూ ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. తనకు లొంగకుంటే యాసిడ్ పోస్తానని, కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. అతడి ఆగడాలు మితిమీరడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన నిందితుడు రాజు గురువారం పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అప్పుడు అక్కడే ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు రాజుపై దాడిచేశారు. బాధితురాలు చెప్పుతో అతడి చెంపలు చెడామడా వాయించింది. జోక్యం చేసుకున్న పోలీసులు వారి బారి నుంచి అతడిని విడిపించి అదుపులోకి తీసుకున్నారు.
ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే: యనమల