telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశాలకు హాజరుకాని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 1న జరిగే కేఆర్‌ఎంబీ సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించింది. ఈసారి స్వయంగా సీఎం కేసీఆరే ఈ సమావేశానికి వెళ్లనున్నారు. న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల్లో ఒక్క బొట్టుకూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో
ఇరిగేషన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం కెఆర్ఎంబీ, ట్రైబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని వివరించారు. పూర్తి సమాచారంతో కెఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా మాట్లాడాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు

మరోవైపు కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం కేటాయించాలన్న తెలంగాణ వాదన ఆమోదయోగ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. కృష్ణా జలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఇందులో భాగంగా కేఆర్‌ఎంబీకి వరుస లేఖలు రాస్తోంది. 2021-22 నీటి సంవత్సరంలో తమకు 70 శాతం.. తెలంగాణకు 30 శాతం దామాషా విధానాన్ని పాటించాలని కేఆర్‌ఎంబీని కోరింది. వచ్చేనెల 1న జరిగే భేటీలో గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. విభజన జరిగిన తర్వాత ఏడేళ్ల వరకు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన గెజిట్ విడుదల చేయలేదు. గతంలో గెజిట్ విడుదల చేయాలని కోరినా అప్పట్లో పట్టించుకోలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రధానంగా నీటి వివాదాల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది.

ఫిఫ్టీ ఫిఫ్టీ పంచాలన్న తెలంగాణ డిమాండ్‌పైనా ఏపీ ప్రభుత్వం సీరియస్‌గానే స్పందిస్తోంది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 సంవత్సరానికి 70:30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌ నాలుగో తేదీన జరిగిన 12వ కేఆర్‌ఎంబీ సమావేశంలో 2021-22 సంవత్సరంలో 64:34 దామాషాలో నీటి పంపకాలు చేసుకునేందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయని, ఇప్పుడు చెరిసగం జలాలు పంచాలని తెలంగాణ కోరడం అర్థరహితం అని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో ఈఎన్‌సీ గుర్తుచేశారు.

Related posts