కర్నాటక అసెంబ్లీలో జరుగుతున్నా విమర్శలపై స్పీకర్ రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి కావాలనే ప్రాణం పోశానని కొందరు నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు. బలపరీక్షపై కావాలనే తాను జాప్యం చేస్తున్నానని కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. తనపై బురద చల్లుతున్నారని భావోద్వేగానికి గురయ్యారు.
తన తల్లిదండ్రులు తనకు సంస్కారాన్ని నేర్పారని రమేశ్ కుమార్ చెప్పారు. గౌరవ మర్యాదలతో తాను బతుకుతున్నానని… తనను బోనులో నిలబెట్టి చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో వ్యాపార వ్యవహారాల గురించి చర్చ జరపాల్సిన పరిస్థితి రావడం బాధాకరంగా ఉందని అన్నారు. బేరసారాలపై సభలో పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం సిగ్గుపడే విషయమని రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.