ఐపీఎల్ 2020 సీజన్ ముగియగానే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మూడు నెలల ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్లు జరగనున్నాయి. నవంబర్ 27న మొదలయ్యే ఈ టూర్ కోసం భారత జంబో జట్టు ఆసీస్కు వెళ్లనుంది. దుబాయ్ నుంచి సిడ్నీకి ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. అయితే టెస్టు సమరం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ శుభవార్త అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగే ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే అవకాశాలున్నాయి. మెల్బోర్న్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పడుతుండటంతో ఆ దిశగా సమాలోచనలు జరుగుతున్నాయి. అయితే వచ్చే వారం జరగనున్న మెల్బోర్న్ కప్ గుర్రపు పందేల పోటీలకు మాత్రం అభిమానులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక డిసెంబరు నెల చివరలో జరిగే బాక్సింగ్ డే టెస్టు మాత్రం ప్రేక్షకుల నడుమ జరిగే వీలుందని విక్టోరియా రాష్ట్ర ప్రిమియర్ డానియల్ ఆండ్రూస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
‘మెల్బోర్న్ కప్నకు, బాక్సింగ్ డే టెస్టుకు చాలా తేడా ఉంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకులు హాజరవుతారనే నమ్మకంతో ఉన్నా. అయితే ఎంత మందిని అనుమతించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయా టెస్టుకు ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా ఉంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని డానియల్ ఆండ్రూస్ చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సిన భారత టెస్టు ఆటగాళ్లు చేటేశ్వర్ పుజారా, హనుమ విహారి ఆదివారం యూఏఈ చేరుకున్నారు. ఇప్పటికే భారత ఆటగాళ్లు యూఏఈలో ఐపీఎల్ ఆడుతుండడంతో మిగతా క్రికెటర్లు, కోచింగ్ సిబ్బందిని కూడా అక్కడికే రప్పించి, తర్వాత అందరినీ ఆస్ట్రేలియా పంపించనున్నారు. పుజారా, విహారితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ యూఏఈ చేరుకోగా.. హెడ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఒక రోజు ఆలస్యంగా సోమవారం అక్కడికి చేరుకున్నాడు.
ప్రతి అక్రమకట్టడాన్ని కూలగొడితే స్వాగతిస్తాం: అఖిలప్రియ