దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ లైట్లతో, క్రిస్మస్ ట్రీలతో క్రిస్మస్ పండగ కళను సంతరించుకున్నాయి. అర్థరాత్రి నుంచే కోవిడ్, ఒమిక్రాన్ మహమ్మారులను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్లో ఆంక్షల మధ్య క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చర్చిల సామర్థ్యంలో 50శాతం వరకే అనుమతించాలని ఆయా ప్రభుత్వాలు స్పష్టం చేసిన నేపథ్యంలో.. పరిమిత సంఖ్యలోనే భక్తులు హాజరయ్యారు.
బంగాల్లో సామూహిక ప్రార్థనలు జరిగాయి. కోల్కతాలోని సెయింట్ థెరిసా చర్చిలో నిర్వహించిన ప్రార్థనలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా పలువురు ప్రముఖులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలోని మెదక్ సీఎస్ చర్చిలో ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శిలువ ఊరేగింపు మొదటి ఆరాధనలో చర్చ్ బిషప్ సాల్మన్ రాజు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలోని మూడు లక్షల మందికి ప్రభుత్వం కానుకలు అందించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
అలాగే ఏపీలోనూ క్రిస్మస్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అక్కడ కూడా రాత్రి నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇడుపుల పాయలోని ప్రార్ధనా మందిరంలో ప్రత్యేక ప్రార్ధనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని దేవుడిని కోరుకున్నట్లు జగన్ ఈ సందర్భంగా చెప్పారు.
ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, మహారాష్ట్రలో భారీగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండంతో అక్కడి ప్రభుత్వాలు వేడుకలపై పరిమితులు విధించాయి. ఢిల్లీ ప్రభుత్వం సామూహిక వేడుకలను నిషేధించింది. ఎవరి ఇంట్లో వారు ప్రార్థనలు నిర్వహించుకోవాలని తెలిపింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్ సందడి లేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను: ఎంపీ కోమటిరెడ్డి