అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ తిరిగి వస్తాడని చిరంజీవి పేర్కొన్నారు. మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో శుక్రవారం రాత్రి చిరంజీవి, పవన్కల్యాణ్, అల్లు అరవింద్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం జరగడంతో ఆయన బైక్పై నుంచి కిందపడిపోయారు. దీంతో అభిమానులు సోషల్మీడియా వేదికగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్కల్యాణ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్తోపాటు సందీప్ కిషన్ సైతం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యుల్ని ఆరా తీశారు.
అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడని తెలిపారు. మరోవైపు సోషల్మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సాయి తేజ్ గురించి ట్వీట్లు పెడుతున్నారు. ‘బ్రదర్ సాయిధరమ్తేజ్.. త్వరగా కోలుకోవాలి’ అని ఎన్టీఆర్ అన్నారు. రవితేజ, నిఖిల్, మంచు మనోజ్, కార్తికేయ, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు శ్రీనువైట్ల తదితరులు సైతం తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.