విజయనగరం జిల్లా రామతీర్థంలో ఆలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.
బోడికొండపై రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం.. తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు అసహనం వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే, ఈ పరిణామాలపై చంద్రబాబు స్పందిస్తూ.. వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మంత్రుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా.. రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందన్నారు.
దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని ఆరోపించారు చంద్రబాబు.. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించిన ఆయన.. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా..? కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి లేదా.? ఆలయ పెద్దలకు ఇదేనా మర్యాద ? కక్ష సాధింపులతో సాంపద్రాయాలకు ఈ ప్రభుత్వం శఠగోపం పెడతోంది” అని ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని విమర్శించిన చంద్రబాబు.. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని ఆరోపించారు. ఇక, రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళమిస్తే ఎందుకు తీసుకోలేదు..? భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు..? అని చంద్రబాబు ప్రశ్నించారు.
రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదన్న ఆయన.. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరి చిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరు పారేసుకుంటున్నారంటూ సీరియస్ కామెంట్లు చేశారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని రెండేళ్లుగా కాపాడుతున్నారు. ఒక్క నిందితుడినైనా ప్రజల ముందు నిలబెట్టారా.? మీ అరాచక, దుర్మార్గాలు ఎల్లకాలం సాగవు” అని చంద్రబాబు హెచ్చరించారు
40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్