ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కశ్మిరీ పండిట్లపై ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బుధవారం ఆందోళనలు చేపట్టింది.
భాజపా ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. కేజ్రీవాల్ ఇంటి వద్దకు భారీగా చేరుకన్న బీజేపీ కార్యకర్తలు..సీఎం ఇంటిముందు ఉన్న మెయిన్గేట్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దాదాపు 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతేగాక సీఎం ఇంటి గోడలపై పెయింటింగ్ పూశారు. అడ్డుకున్న పోలీసులతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. సినిమాలో పండిట్లను తరిమేసినట్లు, ఊచకోత కోసినట్లు చూపించడం అబద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే ఈ చిత్రానికి బీజేపీ చేస్తున్న ప్రచారంపై కూడా విమర్శలు గుప్పించారు.
దీంతో సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో ఆ పార్టీ మోర్చా కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఐపీ కాలేజ్ నుంచి సీఎం ఇంటి వద్దకు చేరుకొని దాడికి ప్రయత్నించారు.
‘దేశంలోని హిందువులను అవమానించినందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పే వరకు బీజేపీ యువమోర్చా అతనిని విడిచిపెట్టదు’ అని తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు.
మరోవైపు.కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల నిరసనను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముఖ్యమంత్రి నివాసానికి చేరుకోవడానికి ఢిల్లీ పోలీసులు సహకరించారని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు విధ్వంసం, హింసను సులభతరం చేశారని పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విమర్శించారు