telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లావణ్య త్రిపాఠి నాన్ ప్రాఫిట్ వెంచర్… ‘రెడ్‌‌ట్రీ’ మాస్కుల తయారీ

Lavanya Tripati

కరోనా (కొవిడ్-19) కాలంలో మాస్క్‌లు ధరించడం ఎంతో అవసరం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది తప్పనిసరి కూడా. అందుకే, హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ అనితా రెడ్డి సహకారంతో ఈ ఏడాది మార్చి నుంచి స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాస్క్‌లు తయారు చేయిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ‘రెడ్‌ట్రీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి మాస్క్‌లను తీసుకువస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వీలైనంత ఎక్కువ మందికి మాస్క్‌లు అందజేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా తీసుకొనే ఆరోగ్య జాగ్రత్తలకు తమవంతు సహాయం అందిస్తున్నారు. తమ ‘రెడ్‌ట్రీ’ మాస్క్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు దొరికిందని, నిబంధనలు సడలించారని మాస్క్‌లు ధరించడం మానవద్దు. కరోనాతో చేస్తున్న ఈ పోరాటంలో మీకు బోర్ కొట్టి ఉండొచ్చు. మీరు విసుగిపోయి ఉండొచ్చు. కానీ, కరోనాకు బోర్ కొట్టలేదు’’ అని అన్నారు.

‘గో లోకల్ – బీ వోకల్’ అంటూ ప్రజలు నినదిస్తున్న ప్రస్తుత తరుణంలో లోకల్ టాలెంట్‌కి అవకాశం ఇస్తూ లావణ్య త్రిపాఠి ఈ మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలామంది ఇప్పటికే ‘రెడ్‌‌ట్రీ’ మాస్క్‌లు ధరిస్తున్నారు. ‘రెడ్‌‌ట్రీ’ మాస్క్‌ల తయారీ ఎలా ప్రారంభమైందో లావణ్య త్రిపాఠి వివరిస్తూ.. ‘‘కరోనా కారణంగా మా టైలర్స్, మాస్టర్స్‌కి మేం పెయిడ్ లీవ్స్ (వేతనంతో కూడిన సెలవులు) ఇచ్చాం. లాక్‌డౌన్ వల్ల ఇంట్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందని వాళ్లు చెప్పారు. ఏ పని లేకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నామని చెప్పారు. వాళ్లకు సహాయ పడేలా ఏదైనా చేయాలని మాస్క్‌ల తయారీ ప్రారంభించాం. అటు మాస్క్‌లు కొనుక్కునే వాళ్లకు, ఇటు టైలర్స్‌కి సహాయపడాలన్నది మా ఉద్దేశం. మాది నాన్ ప్రాఫిట్ వెంచర్’’ అని అన్నారు. ప్రస్తుతం ‘రెడ్‌ట్రీ’ బ్రాండ్ పేరు మీద మాస్క్‌లు మాత్రమే తయారు చేస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో ఈ బ్రాండ్ పేరు మీద మరిన్ని ఉత్పత్తులు తీసుకురావాలనే ఉద్దేశంలో లావణ్య, అనిత ఉన్నారు.

Related posts