కోల్కతా.. ఐపీఎల్లో వరుస ఓటముల తర్వాత మళ్లీ గాడిలో పడి వరుసగా రెండో విజయంతో ప్లేఆఫ్ రేసులో నిలిచింది. శుక్రవారం జరిగిన పోరులో ఆ జట్టు పంజాబ్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. సామ్ కరన్ (55 నాటౌట్; 24 బంతుల్లో 7×4, 2×6), నికోలస్ పూరన్ (48; 27 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. శుభ్మన్, క్రిస్ లిన్ (46; 22 బంతుల్లో 5×4, 3×6) రాణించడంతో లక్ష్యాన్ని కోల్కతా 18 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.
కోల్కతాకు శుభ్మన్, లిన్తో కలిసి 184 పరుగుల భారీ ఛేదనలో శుభారంభం అందించాడు. ఈ జోడీ 6 ఓవర్లలో 62 పరుగులు జత చేయడంతో కోల్కతా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. శుభ్మన్ చక్కటి క్రికెటింగ్ షాట్లతో పరుగులు సాధించగా.. లిన్ తన శైలిలో ఎడాపెడా బాదాడు. అర్ష్దీప్ బౌలింగ్లో మూడు ఫోర్లు బాదిన అతను.. ఆండ్రూ టై బౌలింగ్లో రెచ్చిపోయి రెండు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి మరో షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. ఈ స్థితిలో ఉతప్ప (22; 14 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆడి కోల్కతా రన్రేట్ పడిపోకుండా చూశాడు. కానీ ఉతప్ప ఔట్ కావడంతో రసెల్ (24; 14 బంతుల్లో 2×4, 2×6) క్రీజులోకి రావడంతో అందరూ అతని వైపు చూశారు. ఐతే ఆశ్చర్యపరుస్తూ శుభ్మన్ చెలరేగాడు. అశ్విన్ బౌలింగ్లో అతను రెండు సిక్స్లు, ఫోర్ కొట్టి ఈ సీజన్లో మరో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రసెల్ కూడా ఉన్నంతసేపు మెరవడంతో నైట్రైడర్స్కు ఛేదన తేలికైపోయింది. మూడు ఓవర్లలో 18 పరుగులు అవసరమైన స్థితిలో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (21 నాటౌట్; 9 బంతుల్లో 2×4, 1×6) రెండు ఫోర్లు, సిక్స్ బాది రెండు ఓవర్లు ఉండగానే జట్టును గెలిపించాడు.
అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్కు శుభారంభం లభించలేదు. రాహుల్ (2) మూడో ఓవర్లోనే వెనుదిరిగ్గా.. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన గేల్ (14) మరో భారీ షాట్కు వెళ్లి ఔట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు సందీప్ వారియర్ (2/31) తీశాడు. అయితే వికెట్లు పడినా పూరన్ మాత్రం తగ్గలేదు. గర్నీ బౌలింగ్లో సిక్స్తో మొదలు పెట్టిన అతను.. చావ్లాను లక్ష్యంగా చేసుకుని రెండు సిక్స్లు, రెండు ఫోర్లు కొట్టాడు. 5 ఓవర్లకు 28/2తో ఉన్న పంజాబ్.. పూరన్ మెరుపులతో 10 ఓవర్లకు 84/2కు చేరుకుంది. అర్ధసెంచరీకి చేరువైన పూరన్.. రాణా బౌలింగ్లో భారీ షాట్కు పోయి ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ (36), మన్దీప్సింగ్ (25) కీలక సమయంలో వెనుదిరగడంతో పంజాబ్ 18 ఓవర్లకు 155/5తో నిలిచింది. అయితే సామ్ కరన్ ఇన్నింగ్స్కు మెరుపు ముగింపు ఇచ్చాడు. నరైన్ బౌలింగ్లో సిక్స్, ఫోర్తో మొదలు పెట్టిన ఈ లెఫ్ట్హ్యాండర్.. రసెల్ బౌలింగ్లో మరో రెండు ఫోర్లు అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కరన్ మరింత చెలరేగిపోయాడు. గర్నీ వేసిన ఆ ఓవర్లో అతను మూడు ఫోర్లు, సిక్స్తో సహా 22 పరుగులు రాబట్టడంతో పంజాబ్ భారీ స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది.
నేడు మ్యాచ్ లు : ఢిల్లీ vs రాజస్థాన్ సాయంత్రం 4 గంటలకు; బెంగుళూరు vs హైదరాబాద్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు జరుగుతుంది.