వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర సాయాన్ని వైఎస్ జగన్ కోరనున్నారు. కాగా రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే వైఎస్ జగన్కు నివేదించారు.