ఓ క్రీడాకారిణి రెండు బాధ్యతలు నెరవేరుస్తూ, మరోసారి మహిళా ఔన్నత్యాన్ని చాటిచెప్పింది. ఓ వైపు క్రీడాకారిణిగా రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రత్యర్థి జట్టుతో తలపడుతూనే, మధ్యలో చంటిబిడ్డ ఆకలి తీర్చింది. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్ మధ్యలో విరామం సమయంలో మైదానంలోనే తన ఏడు నెలల చిన్నారికి పాలిచ్చి తల్లిగా తన బాధ్యత నెరవేర్చింది. ఆమే మిజోరంకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్వెంట్లుయాంగీ. మిజోరంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో లాల్వెంట్లుయాంగీ.. టుయ్కమ్ వాలీబాల్ జట్టు తరఫున పాల్గొన్నారు. అయితే కొద్ది నెలల క్రితమే ఆమె తల్లయ్యారు. దీంతో బిడ్డతో కలిసి పోటీలకు వచ్చారు.
తొలి మ్యాచ్లో టుయ్కమ్ జట్టు ప్రత్యర్థి జట్టుతో తలపడుతోంది. మధ్యలో విరామం సమయంలో లాల్వెంట్లుయాంగీ తన ఏడు నెలల చిన్నారికి మైదానంలోనే పాలిచ్చి ఆకలి తీర్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఓ వైపు క్రీడాకారిణిగా రాణిస్తూనే తల్లిగా తన బాధ్యత నెరవేర్చిన లాల్వెంట్లుయాంగీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళలు తమ జీవితంలోని అన్ని బాధ్యతలను సమర్థంగా నెరవేర్చగలరంటూ కొనియాడుతున్నారు. రాష్ట్ర క్రీడల మంత్రి రాబర్ట్ రోమావియా కూడా ఆమెను అభినందించారు. లాల్వెంట్లుయాంగీకి రూ. 10వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.