కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని దుర్యోధనుడితో పోల్చిన ప్రియాంక పై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. తాజాగా ప్రియాంక గాంధీపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అమేథీలో ప్రియాంక మాట్లాడిన మాటలు వింటే చిన్న పిల్లలు చెడిపోతారని, ఆమె తన తిట్లను ఇటలీ వెళ్లి అక్కడి వారికి నేర్పించాలని యోగి హితవు పలికారు.
అమేథీలోని అమాయకులైన పిల్లలకు తిట్లు నేర్పడం ఎందుకు? అని ప్రశ్నించారు. అదేదో మీ ఇటలీకి వెళ్లి అక్కడివాళ్లకు నేర్పొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. మొదట యువరాజు రాహుల్ గాంధీ ని బరిలో దింపారు. ఇప్పుడు యువరాణి ప్రియాంక గాంధీ ని రంగంలోకి తీసుకువచ్చారన్నారు. చివరికి అమేథీలో కూడా ఓడిపోబోతున్నారని యోగి జోస్యం చెప్పారు.