మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ హీరోహీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇది 25వ చిత్రం. ముగ్గురు నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రానికి అన్నీ బాగా కలిసొస్తున్నాయనేది తాజా పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో టికెట్ల రేట్లను 2 వారాల పాటు పెంచడంతో పాటు, తెలంగాణ మొత్తం ఈ సినిమాను 5 ఆటలు ఆడించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. మే 9వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రమంతటా ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య సమయంలో అదనపు ఆటకు అనుమతి లభించింది. ఈ సినిమాతో మహేష్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నిర్మాతలు అనుమతి కోరినప్పటికీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సమాచారం.
previous post