గత కొన్ని రోజులుగా వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో రాజకీయ హీట్ పెరుగుతుంది.. ప్రస్తుతం కేంద్రం వర్సెస్ టీఆర్ఎస్ వార్ నడుస్తోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా కేంద్రం నుంచి స్పష్టత నెలకొనడం లేదు.
ఈ క్రమంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా.. నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెరాస నిరసనలు చేయనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.
ఓ వైపు వరిధాన్యం కొనుగోలు విషయంలో తాడోపేడో తెల్చుకోవడానికి తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రులను కలిసేందుకు దిల్లీకి వెళ్లారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీకి ఇవ్వాలని కోరనున్నారు. ఇప్పటికే సగం తెలంగాణ మంత్రివర్గం ఢిల్లీకి చేరుకోగా.. మరికొందరు మినిస్టర్లు కూడా అక్కడికి వెళ్లనున్నారని సమాచారం.
మరోవైపు రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ కేంద్రంపై పోరుకు సిద్ధమైంది. ఊరురా, గ్రామగ్రామానా నిరసన ర్యాలీలు, శవడప్పు కార్యక్రమాలు, ఆందోళనలుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది.