telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బిజేపిలోకి ఈటల.. టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థిగా కీలక నేత !

TRS flag

ఈటల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే.. ఎంతో మంది నాయకులు టీఆర్ఎస్ ను వీడి.. అడ్రసు లేకుండా పోయారని మరికొందరి వాదన. అయితే ఈటల ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అని అందరిలో ఓ ప్రశ్న మెదులుతోంది. కానీ తాజా సమాచారం మేరకు ఈటల రాజేందర్ BJP లో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకుగాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది.ఈటెలతో పాటు మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ BJP లో చేరే అవకాశం ఉన్నది. జూన్ 2 న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఈ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరినీ బరిలోకి దించుతుందో అనేది పెద్ద సవాలుగా మారనుంది. ఎందుకంటే హుజూరాబాద్ లో ఈటల స్థాయి నాయకులు ఎవరు లేరు. పక్క నియోజకవర్గంలో నుంచి ఓ నాయకున్ని తెచ్చుకోవాలి… లేదా ఇతర పార్టీల లీడర్ కు గాలం వేయాల్సిందే. అయితే గులాబీ బాస్.. ఇతర పార్టీ లీడర్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈటల బిజేపి లోకి చేరగానే.. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారట. ఈ వ్యూహంపై ఇప్పటికే ట్రబుల్ షూటర్ కు ఆదేశాలు వెళ్లాయని టాక్. అన్ని అనుకుంటే పెద్దిరెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related posts