కడప జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చెన్నై నుంచి కడప జిల్లాలోని నందలూరుకు వెళ్తున్న కారును ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లె చెరువు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నీలపల్లికి చెందిన మణెమ్మ, సాయికిరణ్, డ్రైవర్ పవన్ కల్యాణ్ ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.