అక్షరాస్యతలో కేరళ ఎప్పటిలానే అగ్రస్థానంలో నిలిచింది. 96.2 శాతం తో దేశంలోనే కేరళ అగ్రస్థానంలో నిలవగా, 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచింది. 2017-18 మధ్య ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ అనే అంశంపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహించిన ‘జాతీయ నమూనా సర్వే’లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ సర్వే ప్రకారం ఏపీలో పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతంగా ఉండగా, మహిళల్లో 59.5 శాతంగా ఉంది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేళ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత రేటుపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను సమర్పించింది. దీని ప్రకారం దేశంలో అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 73.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం 87.7 శాతంగా ఉంది.
అక్షరాస్యత విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ 88.7 శాతంతో రెండో స్థానంలో నిలవగా, 87.6 శాతంతో ఉత్తరాఖండ్, 86.6 శాతంతో హిమాచల్ ప్రదేశ్, 85.9 శాతంతో అసోం వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలవగా, 72.8 శాతంతో తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది.