ధోనీ బయోపిక్ తో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ ట్విటర్ లో విచారం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న యువ నటుడు చిన్న వయసులోనే వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు.
తన నటనతో టీవీ రంగంలోనూ, సినిమాల్లోనూ అందరినీ రంజింపజేశాడని, వినోద రంగంలో అతడి ఎదుగుదల ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని మోదీ ట్వీట్ చేశారు. అనేక చిత్రాల్లో చిరస్మరణీయ ప్రదర్శనలను మనకు మిగిల్చి తాను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.