నేడు ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు విశాఖపట్నం చేరుకున్నారు. బెంగళూరు నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న వీరు రోడ్డు మార్గాన నొవోటెల్ హోటల్కు వచ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం వేదికగా రేపటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్లో అతడు ఆడతాడు. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు దక్షిణాఫ్రికా, ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య సన్నాహక టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. మయాంక్ అగర్వాల్, కరుణ్నాయర్, శార్ధూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో ఆడనున్నారు. దక్షిణాఫ్రికా ప్రధాన జట్టులోని క్రీడాకారులంతా ఈ మ్యాచ్లో బరిలోకి దిగనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నార్త్జోన్ క్రికెట్ అకాడమీ కార్యదర్శి జీవీ సన్యాసిరాజు తెలిపారు. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించే మ్యాచ్ కోసం పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ మ్యాచ్ను వీక్షించేందుకు రోజుకు 1,500 మంది నుంచి 2,000 మంది వరకు ప్రేక్షకులు వస్తారన్న అంచనాతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్ను చూసేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన లేదన్నారు. గతంలో ఇదే స్టేడియంలో ఇండియా, శ్రీలంక మహిళా జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నార్త్జోన్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ సీడీ థామ్సన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సీతారామరాజు, అకాడమీ నిర్వాహకుడు సి. జగదీష్నాయుడు పాల్గొన్నారు. కాగా, అక్టోబర్ 2 నుంచి వైజాగ్లో భారత్-దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ జరగనుంది.