కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. సోమవారం ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అయినా పోలీసుల కళ్లుగప్పి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరారు. ఈ సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని నెట్టేసి ప్లాన్ ప్రకారం ప్రగతిభవన్ కు వెళ్లారు.
రేవంత్ రెడ్డిని అడ్డుకున్న ఎస్ ఐ నవీన్ ను రేవంత్ రెడ్డి నెట్టేయడంతో అతనికి గాయాలయ్యాయి. దీంతో ఎస్ఐ నవీన్ రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రేవంత్ రెడ్డి పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు.