ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని ఏపీ సీఎం జగన్ అన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంపై జిల్లా పాలనాధికారులతో జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజల వినతి పత్రాలకు రశీదులు ఇవ్వాలి అని తెలిపారు. ఫలానా తేదీ లోగా సమస్య పరిష్కరిస్తామని రశీదులపై రాసి ఇవ్వాలని ఆదేశించారు.
రశీదులను డేటా బేస్ లో పెట్టాలని, కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం సమీక్షించాలని, ఆకస్మిక తనిఖీలు చేయాలని, తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. గడువులోగా సమస్య పరిష్కరిస్తున్నారో లేదో కచ్చితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘రచ్చబండ’లో భాగంగా స్పందన కార్యక్రమాన్ని పరిశీలిస్తానని అన్నారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంపై మంగళవారం సమీక్షిస్తానని జగన్ తెలిపారు.