రోజురోజుకూ పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో చట్టంలో మరో సవరణకు బీజేపీపై ఎన్డీఏ పార్టీలు ఒత్తిడి పెంచుతున్నాయి. కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ భర్త, శిరోమణి అకాళీదళ్ పార్టీ చీఫ్, ఫిరోజ్ పూర్ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ బాదల్ తన మనసులోని మాటను వెళ్లగక్కారు. సీఏఏలో ముస్లింలను కూడా చేర్చుకుందామని బీజేపీని కోరుతున్నట్లు చెప్పారు. శనివారం చండీగఢ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయం వెల్లడించారు. భిన్నమతాల కలయికగా వర్ధిల్లుతుండటమే ఇండియా గొప్పతనమని, కేంద్రంలోని మోడీ సర్కార్ మంచి ఉద్దేశంతో సీఏఏను తీసుకొచ్చిందని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లో మతపరమైన హింసను ఎదుర్కొని ఇండిడియాకు వలస వచ్చిన హిందు, సిక్కు, క్రిస్టియన్, జైన, బౌద్ధ, పార్సీలకు పౌరసత్వం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆ జాబితాలో ముస్లింలను కూడా చేర్చితే బాగుంటుందని, దేశవ్యాప్తంగా నిరసనల ద్వారా జనం కోరుతున్నది కూడా ఇదేనని బాదల్ తెలిపారు.
సీఏఏలో కేవలం ముస్లింలను మాత్రమే పక్కనపెట్టడం తనకూ నచ్చలేదని సుఖ్ బీర్ చెప్పారు. మరోసారి సవరణ చేయడం ద్వారా ముస్లింలను కూడా జాబితాలో చేర్చాలని, అప్పుడే పౌరసత్వ చట్టానికి నిజమైన అర్థం వస్తుందన్నారు. శిరోమణి అకాళీదళ్ పార్టీ కూడా ఇదే కోరుకుంటున్నదని, పార్లమెంట్ లోనూ తానీ అంశాన్ని ప్రస్తావించానని ఆయన తెలిపారు. వినతి చేయడం వరకే తన పని అని, వినడమా? పక్కనపెట్టడమా? అన్నది కేంద్ర ప్రభుత్వం ఇష్టమని బాదల్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ వస్తే ఒక మతానికి చెందినవాళ్లను వెళ్లగొడతారంటూ జరుగుతున్న ప్రచారంలో అర్థంలేదని, ఎన్ఆర్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెల్లడైన తర్వాతే దానిపై మాట్లాడే వీలుంటుందని సుఖ్ బీర్ అన్నారు.