సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుటుంబానికి పరామర్శించేందుకు వరంగల్ వెళ్తుండగా పోలీసులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు.. ఘట్కేసర్ వద్ద రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీరుపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి.
తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్రెడ్డి పోలీసులకుప్రశ్నించారు.పోలీసులకు రోజు ఇదో పని అయిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిన్న బాసర వెళ్తే అక్కడ కూడా అడ్డుకున్నారని.. నేడు ఇక్కడ అడ్డుకుంటున్నారని విమర్శించారు
టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొంటే రాని ఉద్రిక్తత తాను వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఉద్రిక్తత తలెత్తుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడినని ఈ ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని ఎలా అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు రేవంత్ రెడ్డి. అన్యాయంగా తనను అరెస్ట్ చేయకూడదంటూ పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలోనే పోలీసులుకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే పోలీసులు బలవంతంగా రేవంత్ రెడ్డిని వారి వాహనంలో ఎక్కించి.. అక్కడి నుంచి పోలీస్స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు.
అయితే కాంగ్రెస్ శ్రేణులు పోలీసు వాహనాన్ని అడ్డుకునేందు యత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.