telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆస్తులను డిజిటలైజేషన్ లో అరుదైన ఘనత సాధించిన పోలీస్‌ శాఖ

తెలంగాణలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు డిజిటలైజ్ చేసిన మొట్ట మొదటి ప్రభుత్వ శాఖగా పోలీస్ శాఖ ప్రత్యేకత సాధించింది. ప్రభుత్వ శాఖలకు చెందిన భూములన్నింటినీ పోర్ట్ స్థాయిలో సర్వే నిర్వహించి డాక్యుమెంటేషన్ చేయడం తోపాటు డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆదేశించంతో ఈ ప్రక్రియను రికార్డ్ సమయంలో పూర్తి చేసిన తోలి ప్రభుత్వ శాఖగా తెలంగాణా పోలీస్ నిలిచిందని డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ టాస్క్ పూర్తి చేయడానికి తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించిందని తెలిపారు. పోలీస్ శాఖ భూ వివరాల డాక్యుమెంట్ విడుదల సందర్బంగా నేడు రాష్ట్రం లోని పోలీస్ శాఖకు చెందిన 55 యూనిట్ లకు చెందిన పోలీస్ ఎస్టేట్ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ నేడు డీజీపీ కార్యాలయంలో జరిగింది. అడిషనల్ డీ.జీ.పీ.గోవింద్ సింగ్, ఐ.జీ సంజయ్ జైన్, ఏ.ఐ.జీ వెంకటేశ్వర్లు, ట్రాక్ కు చెందిన డా. చంద్ర శేఖర్, పోలీస్ శాఖ రాష్ట్ర ఎస్టేట్ అధికారి, డీఎస్పీ ఏ వేణుగోపాల్, ఐ.టీ విభాగం డీ.ఎస్.పీ శ్రీనాద్, డీఎస్పీ గంగారాం తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రంలో పోలీస్ శాఖకు చెందిన 940 ఆస్తులను గుర్తించి వాటిలో 7050 ఎకరాల 24 గుంటల భూములున్నట్లు నిర్దారించామని వివరించారు. 167 పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలు ప్రయివేట్ భవనాలలో ఉన్నాయని,మరో 42 స్థలాలు పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను కేటాయించిందని తెలిపారు.
పట్టుదల, క్రమశిక్షణ, విశ్వసనీయత ఉంటె అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని పోలీస్ ఆస్తుల నిర్దారణ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ నిరూపించిందని, ఇది దేశంలోని పలు శాఖలకు మార్గ దర్శకంగా, ఆదర్శంగా నిలుస్తుందని తెలియచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ టాస్క్ ను పట్టుదలతో అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ఆదర్శంగా నిల్చిన యూనిట్ కార్యాలయాల ఎస్టేట్ అధికారులకు ప్రత్యేక పురస్కారాలను అందిస్తున్నట్టు ప్రకటించారు. పోలీస్ శాఖకు చెందిన భవనాలను, పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలనన్నింటినీ ఎత్తు, వెడల్పు, భవన స్వరూపం,జీపీఎస్ కోఆర్డినెట్స్ తో సహా డిజిటల్ ఫోటోలను రిమోట్ సెన్సింగ్ సహాయంతో రూపొందించి త్వరలోనే పోలీస్ వెబ్ సైట్ లో ఉంచుతామని వెల్లడించారు. మనం చేసే ఏపనిలోనైనా ప్రజల భాగస్వామ్యం చేస్తే అవి పూర్తిస్థాయిలో విజయ వంతమవుతాయని రాష్ట్రం లో సి.సి. టీ.వీ ప్రాజెక్ట్ నిరూపించిందని ఉదహరించారు. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ప్రజల భాగస్వామ్యంతో ఆరు లక్షలకు పైగా సి.సి. టీవీ లను ఏర్పాటు చేశామని, చైనా లోని నగరాలను మినహాయిస్తే లండన్ తర్వాత అత్యధిక సి.సి. టీవీ లున్న నగరంగా హైదరాబాద్ చరిత్రలో నిలిచిందని గుర్తు చేశారు. పోలీస్ శాఖ ఆస్తుల నిర్దారణ డిజిటలైస్ చేయడంద్వారా భూములు ఆక్రమణలకు గురికావని, పైగా ఏదైనా లీగల్ వివాదాలు ఏర్పడినా సరైన రికార్డులు స్పష్టమైన రీతిలో ఉంటాయని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పక్రియను విజయ వంతంగా చేయడానికి పోలీస్ శాఖలో మొట్ట మొదటి సారిగా ఎస్టేట్ అధికారులను నియమించామని అన్నారు. ఈ సందర్బంగా కార్యాలయాల నిర్వహణపై రూపొందించిన సార్టింగ్, సిస్టమాటిక్, స్టాండర్డైజెషన్, సెల్ఫ్ డిసిప్లీన్, షైనింగ్ విధానాలతో కూడిన ఫైవ్- ఎస్ సూత్రాలను ప్రతీ ఒక్క అధికారి పాటించాలని డీజీపీ వివరించారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఎస్టేట్ అధికారులకు డీజీపీ ప్రశంసా పత్రాల ప్రదానం చేశారు.

Related posts