భారత్లో వేల ఏళ్లుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయానికి వెళ్లి యూఎన్ జనరల్ అసెంబ్లీ(UNGA)76 వ సమావేశంలో ప్రసంగించారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తోందని గుర్తు చేశారు. భారత్లో ఉన్న వైవిధ్యమైన పరిస్థితులే ఇక్కడి బలమైన ప్రజాస్వామ్యానికి గుర్తింపు అని అన్నారు.
“ప్రజాస్వామ్యానికి తల్లిగా భావించే దేశానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. భారత్కు వెయ్యేళ్లుగా ప్రజాస్వామ్యమే గొప్ప సంప్రదాయం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి భారత్ గొప్ప ఉదాహరణ. వైవిధ్యంతోనే మా ప్రజాస్వామ్యానికి గుర్తింపు.”గడిచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొందని మోదీ గుర్తు చేశారు. వందేళ్లలో లేని మహమ్మారిని చవిచూసిందని అన్నారు. ప్రమాదకరమైన వైరస్కు బలైనవారికి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
భారతదేశంలోని టీ స్టాల్లో తన తండ్రికి సాయం చేస్తున్న ఒక చిన్న పిల్లవాడు నాలుగోసారి భారత ప్రధానిగా UNGA ని ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా మన ప్రజాస్వామ్య బలం నిరూపించబడింది. భారత్ వృద్ధి చెందితే, ప్రపంచం కూడా వృద్ధి చెందుతుందని అన్నారు..”ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యంగా తయారు కావాల్సిన అవసరం ఉందని కరోనా మహమ్మారి మనకు నేర్పించింది. అందుకే గ్లోబల్ వ్యాల్యూ చైన్ విస్తరణ జరగడం ముఖ్యం. ఈ విజన్ ఆధారంగానే మా ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ రూపొందిందని అన్నారు.
అలాగే ..అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడటం చాలా అవసరమని అన్నారు.
“ప్రస్తుత సమయంలో అఫ్గానిస్థాన్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి మహిళలు, చిన్నారులు, మైనారిటీలకు సహాయం కావాలి. మనం మన బాధ్యతను నెరవేర్చాలి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు అఫ్గానిస్థాన్ భూభాగాన్ని ఉపయోగించుకోకుండా చూడటం చాలా ముఖ్యమని అన్నారు.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* ఏడాది కాలంగా ప్రపంచం సంక్షోభంలో చిక్కుకుంది
*మా దేశంలో వైవిధ్యమే ప్రజాస్వామ్యాన్ని బలంగా మార్చింది
*వందేళ్లలో ఎప్పుడూ చూడని కరోనా కష్టకాలాన్ని చూశాం
*గత ఏడేళ్లలో 43 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించాం
*కోట్ల మందికి సురక్షిత ఆరోగ్య సదుపాయాలు కల్పించాం
*కలుషిత నీరు ప్రపంచం మొత్తానికి పెద్ద సమస్య
*17 కోట్ల మందికి సురక్షిత మంచినీటిని అందించగలిగాం
*కరోనా సమయంలో 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించాం
*సమ్మిళిత అభివృద్ధి వైపు భారత్ నడుస్తోంది.
*ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వ్యాక్సిన్ను అభివృద్ధి చేయగలిగాం
*ముక్కుద్వారా ఇచ్చే టీకాను త్వరలో తీసుకొస్తాం
*ఎమ్ఆర్ఎన్ఏ టీకా తయారీ చివరి దశలో ఉంది
*12 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే డీఎన్ఏ టీకాను తయారు చేస్తున్నాం
*వందేళ్లలో చూడని విపత్తును కరోనాతో చూశాం
*ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నది భారత్ విధానం
*భారత్లో వేల ఏళ్లుగా ప్రజాస్వామ్యం కొనసాగుతోంది
*ప్రజాస్వామ్య పాలనలో అన్ని లక్ష్యాలను చేరుకుంటున్నాం
*భారత్ ప్రజాస్వామ్య ప్రకాశానికి ఒక ఉదాహరణ