ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మంగళవారం చేసిన ప్రసంగంలో రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీని ప్రజలకు అందజేసే అంశాలపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల ప్రజలకు ఎలా లబ్ధి చేకూరనుందన్న విషయాలపై ప్రకటన చేయనున్నారు.
భారత్ అంతర్జాతీయంగా పోటీ పడేలా ఈ ప్యాకేజీ ఉంటుందని ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలిపారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయి. జపాన్ తమ జీడీపీలో 21 శాతం, అమెరికా 13 శాతం విలువైన ప్యాకేజీలను ప్రకటించాయి. ఆ తర్వాత భారత్ కూడా అది పెద్ద ప్యాకేజీని ప్రకటించింది.